Wednesday, December 21, 2011

నేను సైతం .... పుస్తక ప్రదర్శనకు ...

హమ్మయ్య! మొత్తానికి ఎలాగైతేనేం నేను కూడా వెళ్ళొచ్చేసా పుస్తకాల పండుగకు. నాకు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన గురించి 2009 నుంచీ తెలిసినా, కరకరాల కారణాల వల్ల ఇప్పటివరకు వెళ్ళటం కుదరలేదు. అసలు ఈ సంవత్సరం కూడా కుదురుతుందనైతే అనుకోలేదు. మొన్న ఆదివారం మా చర్చ్ క్రిస్మస్ వల్ల గత నెల నుండీ ప్రతీ వారాంతం అస్సలు ఖాళీ లేకుండా ఉంది. మళ్ళీ రెండు రోజులకి పండక్కి ఇంటికి వెళ్ళిపోతున్నా... ఈ మూడు రోజుల, అదీ అన్నీ వారపు రోజుల విండోలో అస్సలు వెళ్ళలేనేమో అనుకున్నా. కాని, మొన్న ఆఫీస్ డుమ్మాకొట్టి మరీ వెళ్ళొచ్చెసా :)     
   
అసలు మూడేళ్ళనుంచీ వెళ్ళాలి వెళ్ళాలి అన్న ఇదే గాని, వెళ్ళి ఏమి కొనాలి అని పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే, బ్లాగులు చదవడం మొదలుపెట్టినప్పటినుంచీ బాగా అర్ధం అయింది, మన తెలుగు సాహిత్య పాండిత్యం అంతా ఒట్టి గుండు సున్నా అనీ, ఏం చదివినా, ఓం ప్రధమమే అనీ. కాబట్టి ముందుగా ఏమీ అనుకోలేదు. కాని, వెళ్ళడం కంఫర్మ్ అవ్వగానే మాత్రం మనసులో మెదిలిన పుస్తకాలు శ్రీ రమణ గారి "మిథునం", "వేలుపిళ్ళై" ఇంకా, "ఇల్లేరమ్మ కథలు" (లిస్ట్ కర్టెసీ నెమలికన్ను బ్లాగు). సరే, మిట్టమధ్యాహ్నం, రెండింటికి మా వూళ్ళో బయలుదేరితే, అక్కడికి చేరేసరికి మూడు కొట్టింది. పార్కింగు కష్టాలు దాటి, టిక్కెట్ కొని, పక్కనే ఉన్న దారిలో దూరబోతుంటే, ఆపి, అటువైపు ఎంట్రన్సు అని చెప్పారు. ఆహా! ఎన్నాళ్ళకు వచ్చాను అనుకుని కుడికాలు లోపలికిపెట్టి వెళ్ళాను. అసలు పుస్తకాలు కొనడం, చదవటం ఒక ఎత్తైతే, జస్ట్ ఆపుస్తకాలు అలా చూస్తూ, పేజీలు తిప్పుతూ, ముందు మాటలూ వెనక మాటలూ చదువుతూ, సెకెండ్ హాండ్ పుస్తకాల దుమ్ముకి తుమ్ముతూ అలా అలా తిరగటం నాకు చాలా ఇష్టం.

సరే, వెళ్ళగానే ముందు స్వాగతం చెప్పినవి నానా రకాల న్యూస్ పేపర్ స్టాల్సు. వాటిని దాటుకుని ముందు వెళ్ళ్తుంటే, ఒక యోగి ఆత్మకథ వాళ్ళ స్టాలు ఇంకా నిత్యానంద స్టాలు కనిపించాయి. ఇక పుస్తకాల స్టాళ్ళలో పబ్లికేషన్సువే కాకుండా పుస్తకాల షాపులవి కూడా ఉన్నాయి. ముందే అనుకున్నట్టు, ఇంగ్లీషు పుస్తకాల దగ్గర ఆగకుండా తెలుగు పుస్తకాల దగ్గరే ఆగాము. నేను చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పారావ్ చెయ్యి పట్టుకుని ఆపారు- తెలుగు పుస్తకాలో అన్నావ్ మరి ఎమ్మెస్కో దాటుకుని వెళ్ళిపోతున్నావు అని. అరే, చూస్తే అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ముందు వరసలో ఉన్నాయి, తెలుగు పుస్తకాలు వెనక ఉన్నాయి. ఇక అక్కడి నుంచీ అన్ని తెలుగుపుస్తకాల స్టాళ్ళూ కవర్ చేసుకుంటూ వెళ్ళాము. వంశీ పుస్తకాలూ, కోతికొమ్మచ్చి, ఇల్లాలి ముచ్చట్లూ, రంగనాయకమ్మలూ ఇంకా యండ్మూరీ, యుద్ధనపూడీ, చలం  ఇలాంటివి చాలా స్టాళ్ళల్లో ఉన్నాయి. మంచి పుస్తకం వారి స్టాల్ కనిపించింది. మీ గురించి నేను బ్లాగుల్లో చదివానండీ అని చెప్పాను. కాని అక్కడేమీ కొనలేదు (కూతురు ఇంకా చదవలేదు కదా). ఆగొద్దు అనుకుంటూనే ఒక ఇంగ్లీష్ పుస్తకాల స్టాల్ దగ్గర ఆగాము. అన్నిటికన్నా పైన 1984 - జార్జ్ ఆర్వెల్ ఉంది. సరే అని నేను తీసుకున్నా...అప్పారావు కూడా ఏదో తీసారు. మొత్తానికి ఇద్దరం ఇంగ్లీష్ లోనే బోణీ కొట్టాం.

అప్పటికే చాలా టైము అయినట్టనిపించింది. ఇక త్వరత్వరగా చూస్తున్నా... ఒక దగ్గర శ్రీ రమణ పుస్తకాలు కనిపించాయి కాని, మిథునం లేదు. అక్కడే నాకు ఇల్లేరమ్మ కథలు దొరికింది. పక్కనే "రైలు బడి" కనిపిస్తే, ఎప్పుడో ఆపుస్తకం గురించి చదివినట్టు గుర్తు వచ్చి తీసుకున్నా. హ్మ్మ్... నా తెలుగు బోణీ కూడా అయింది. ఆ... ఆ మధ్య కినిగె స్టాలు కనిపించింది కాని ఆగలేదు. ఇక మా అప్పారవుకి కాల్స్ రావడం మొదలైంది. నాకు టెన్షన్ మొదలైంది. అయ్యో ఇంకా మిధునం దొరకనే లేదు, విశాలాంధ్ర స్టాలు చూడనే లేదు  అనుకుంటూ వేగం పెంచాను. ఒక పిల్లల పుస్తకాల స్టాల్ లో పాప కోసం ఏవో బొమ్మల పుస్తకాలు తీసుకున్నాం ఏదైనా 30 అంట! పాల పిట్ట దగ్గర యమకూపం, తణాయి కనిపించాయి. ఎదురుగా గొల్లపూడి వెంకటరమణ & సన్స్ స్టాల్ ఉంది. చిన్నప్పటి హాతింతాయి కథలు, సింద్బాద్ యాత్రలూ, సహస్ర శిర్స్చేద అపూర్వ చింతామణి కథలూ గుర్తు వచ్చాయి గాని, అవేవీ ఇక్కడ లేవు. ఇంక అప్పారావు విశాలాంద్ర స్టాలు ఎక్కడ అని అడగడం వినిపించింది. ఇంక లాభం లేదు అని డైరెక్టుగా అక్కడికే వెళ్ళాం.

వెళ్తూనే అడిగేసాను మిథునం ఉందా అని. ఒక్క నిముషం అని స్టాలు అవతలి కొసన ఉన్న ఎవరినో అడిగారు అరిచి- మిథునం అంట మాడం కి అని. నేను అటువైపు వెళ్ళాను. వాళ్ళు వేరే స్టాలు వాళ్ళని అడిగారు అరిచి- మాడం కి మిథునం అంట అని... సరిపోయింది, విశాలాంధ్ర దగ్గిర దొరకకపోతే ఇంక దొరకదేమో అనేసుకున్నా. ఎదురు స్టాలుకి వెళ్తే, ఉంది మాడం అని అతను వెతుకుతున్నాడు. నేనూ వెతుకుతున్నా... ఊహూ! ఇక్కడే ఉండాలి మాడం, ఐపోయాయనుకుంటా. ఉసూరుమని మళ్ళీ విశాలాంధ్రకు వచ్చాను. వెళ్దామా అని అప్పారావు... మ్మ్... చుట్టూ దిక్కులు చూస్తూ నేను. కొంచెం దూరంలో నవోదయ వారి స్టాలు కనిపించింది. మీరు ఇక్కడే ఉండండి లాస్ట్ ట్రయల్ చూసి వస్తా అని వెళ్ళాను. మిథునం ఉందా? ఉంది మాడం... లోపల చూడండి...నాకు కనిపించట్లేదు... సరిగ్గా మీ ఎదురుగా ఉంది చూడండి... ఆ... దొరికింది. చిన్న పుస్తకమే. చాటంత ముఖం చేసుకుని పుస్తకం పట్టుకుని వచ్చా. బిల్ పే చేసేసినా వదలకుండా పుస్తకం చేతితోనే పట్టుకుని వున్నాను. మళ్ళీ విశాలాంద్రకు వెళ్ళి, వేలుపిళ్ళై ఉందా అని అడిగాను. ఆ... ఉంది మాడం అని టక్క్ మని తీసిచ్చారు. ఇందాక ఎక్కడో చూసిన ఇల్లాలి ముచ్చట్లు ఇక్కడ కూడా కనిపించడంతో అది కూడా తీసుకున్నా... అప్పారావు కూడా వేరే ఏవో తీసుకున్నట్టున్నారు. బిల్ ఇచ్చి బయటకి నడుస్తుంటే, పక్కన ఉన్న ఇంగ్లీష్ స్టాల్ లో Angela's Ashes కనిపించింది. దాని రివ్యూ కూడా చదివినట్టు గుర్తు వచ్చి అది కూడా తీసుకున్నా... మొత్తానికి ఇంగ్లీష్ లో బోణీ కొట్టి ఇంగ్లీష్ లో ముగించాం.

ఎలాగూ ఆఫీస్ డుమ్మా కాబట్టి దారిలో ఒక నాలుగైదు మజిలీలు చేసుకుంటూ ఇల్లు చేరేటప్పటికి ఏడున్నర. ముందు వెళ్ళగానే, కూతురు కోసం కొన్న పుస్తకాలు దానికిచ్చి, అవి చదివి(బొమ్మలు చూపించి), ఆ పుస్తకాల మీద ఉన్న పుసలతో ఆడించి, ఒక అరగంట తరవాత నా పుస్తకాలూ, అప్పారావు పుస్తకాలూ సర్దుతుంటే ఏంటో తక్కువ అనిపించాయి. చూస్తే విశాలాంధ్రలో కొన్న పుస్తకాలు లేవు. కార్లో వదిలేసామేమో అని చెక్ చెసుకుంటే అక్కడా లేవు. అయ్యో ఇంతా చేసి అక్కడే మర్చిపోయాము అని నేను ఏడుపు మొఖం పెట్టాను. పోనీలే నేను రేపు మళ్ళీ వెళ్ళి తెస్తాను. మనం అంత సేపు అక్కడున్నాము కదా, మనని మర్చిపోరు, పుస్తకాలు వుంచుతారులే అని అప్పారావు చెప్పినా, నా మనసు మనసులో లేదు. నిన్న పాపం తను మళ్ళీ అంత దూరం వెళ్ళి ఆ పుస్తకాలు వున్నాయి నువ్వు గాభరా పడకు అని కాల్ చేసేవరకు నాకు తృప్తి లేదు. రాత్రి ఆఫీస్ నుంచి వెళ్ళగానే నా పుస్తకాలు చూసుకుని అప్పుడు స్థిమిత పడ్డాను. ఆఖరకి వచ్చేసరికి టైము సరిపోకపోయే సరికి, ఇ-తెలుగు స్టాలుకి వెళ్ళటం కుదరలేదు. వెళ్తే ఎవరైనా బ్లాగర్లు కలుస్తారేమొ అనుకున్నా. కాని వాళ్ళు నాకు తెలియొచ్చు గాని, నేను వాళ్ళకు తెలియదు కదా! సరే, వీలుంటే మళ్ళీ వచ్చే యేడు !  ఈ సారికి పుస్తక ప్రదర్శనకి వెళ్ళగలిగాను, అదే పదివేలు. 

p.s: మిథునం చదివేసా... :)